Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం చిరుత దాడిలో మృతి చెందినట్లుగా భావిస్తున్న బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలసి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. క్రూరమృగం బాలికను ఎలా అడవిలోకి తీసుకుని వచ్చి ఉండవచ్చనే విషయాన్ని అటవీ, టీటీడీ అటవీ, విజిలెన్స్ అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన బాధాకరమన్నారు. జూన్ 22 వ తేదీ ఇలాంటి సంఘటనే జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై టీటీడీ ఇప్పటికే అనేక జాగ్రత చర్యలు తీసుకుందన్నారు. అటవీ, పోలీస్,టీటీడీ అధికారులు చర్చించి భద్రతా పరమైన ప్రతిపాదనలు చేస్తే టీటీడీ ఖర్చుతో ఏర్పాటు చేస్తామని శ్రీ కరుణాకర్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరక్కుండా సాంకేతికంగా కూడా ఎలా ఎదుర్కోవాలనే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. అటవీ సంరక్షణ చట్టాలు సమర్థవంతంగా అమలు జరుగుతున్నందువల్ల వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని, భక్తులు వీటి బారిన పడకుండా ఎలా రక్షణ కల్పించాలనేదే టీటీడీకి ముఖ్యమన్నారు. బాలిక కనిపించడం లేదన్న సమాచారం అందిన వెంటనే టీటీడీ అటవీ, పోలీస్,విజిలెన్స్, ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అడవిలో గాలింపు ప్రారంభించారని అన్నారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం లేదని ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని టీటీడీ తరపున ఆదుకుంటామని చెప్పారు. చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలను పక్కకు వదల వద్దని చైర్మన్ విజ్ఞప్తి చేశారు.టీటీడీ డిప్యూటీ సిఎఫ్ శ్రీ శ్రీనివాస్, డిఎఫ్వో శ్రీ సతీష్, విజివో శ్రీ గిరిధర్, సిఐ శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు చైర్మన్ వెంట ఉన్నారు.
Admin
Famous TV