Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : మదనపల్లి, జనవరి 28: జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వాహనాలు అధికారిక బిల్లుల్లేకుండా అమ్మకాలు జరగరాదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులు ఆదేశించారు. అలాగే రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుకింగ్పై ప్రజల్లో అవగాహన పెంచి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం అందించే శాఖలు తమ రెవెన్యూ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మునిసిపల్, రవాణా శాఖల ఆదాయ వనరులపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ శాఖల వారీగా ఆదాయ పురోగతిని సమీక్షించారు. ఎక్సైజ్ శాఖపై సమీక్షలో నాటు సారా, నకిలీ మద్యం విక్రయాలు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగిస్తాయని, వీటిపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. వాహనాల అమ్మకాల్లో అధికారిక బిల్లులు ఉండేలా చూసి, సర్వేలు, తనిఖీలు చేయాలని, మైనింగ్ లీజులను పునరుద్ధరించి కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయడం, ప్రతినెలా ఆదాయ సమీక్షలు నిర్వహించడం, లక్ష్య సాధనలో అలసత్వం లేకుండా కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Admin
Famous TV