Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వైసీపీ అరాచక పాలనలో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు మార్పు కోరుకోవడం స్పష్టంగా కనిపిస్తుందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన తిరుపతి రూరల్ మండలం, బ్రహ్మణపల్లి పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గురించి వివరించారు. సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేపట్టారు. ఈ ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని పులివర్తి నాని అన్నారు. బాదుడే.. బాదుడు తప్ప.. ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం విస్మరించారని ధ్వజమెత్తారు. కరెంట్, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచేశారని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వలస పోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా తరతరాలుగా సరిపడా సంపాదించేశారని ఆరోపించారు. మఠం భూములు స్వాహా చేసి వెంచర్లు వేసి అమాయకపు ప్రజలకు అమ్మేశారని మండిపడ్డారు. మఠం భూముల్లో అక్రమ కట్టడాలు అంటూ ఎండోమెంట్ అధికారులతో కలిసి మళ్లీ కబ్జాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే తాయిలాలు పంచుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నారని వెల్లడించారు. పర్యటిస్తున్న ప్రతి చోటా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని పులివర్తి నాని స్పష్టం చేశారు. చంద్రగిరి కోటపై పసుపు జెండా రెపరెపలు చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Admin
Famous TV