Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : మదనపల్లి విదేశాల నుంచి భారీగా డాలర్లు పంపిస్తున్నామని ఆశచూపి సైబర్ మోసానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా పోలీసులు రట్టు చేశారు.మంగళవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.మదనపల్లె మండలం పప్పిరెడ్డిపల్లెకు చెందిన వడ్లూరి మోహన్ కుమార్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.మార్చి 22న అతనికి ఒక అంతర్జాతీయ నంబర్ నుంచి వాట్సాప్ కాల్ రాగా, అందులో మాట్లాడిన వ్యక్తి తన పేరు ‘ఎడ్విన్’ అని,అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో చిన్నపిల్లల వైద్యుడినని పరిచయం చేసుకున్నాడు.వాట్సాప్ చాటింగ్ ద్వారా మోహన్ కుమార్తో పరిచయం పెంచుకున్న ఆ సైబర్ నేరగాడు,ఏప్రిల్ 4వ తేదీన తాను ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నానని,తన వద్ద ఉన్న 2.5 లక్షల అమెరికన్ డాలర్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని నమ్మబలికాడు.వాటిని విడిపించుకోవడానికి క్లియరెన్స్ ఫీజు చెల్లించాలని,సహాయం చేస్తే ఆ డాలర్లు ఇస్తానని ఆశచూపాడు.అతని మాటలు నమ్మిన బాధితుడు ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ వరకు పలు దఫాలుగా నిందితులు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ద్వారా మొత్తం రూపాయలు 21,37,200 బదిలీ చేసి నిలువునా మోసపోయాడు.తాను మోసపోయానని గ్రహించిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మదనపల్లె తాలూకా పోలీసులు,ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ బి.పావని పర్యవేక్షణలో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేశారు.తాలూకా సీఐ కళా వెంకటరమణ,ఎస్ఐ రామకృష్ణారెడ్డి మరియు సైబర్ సెల్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో మంగళవారం ఉదయం మదనపల్లె-తిరుపతి ప్రధాన రహదారిలోని తట్టివారిపల్లె క్రాస్ వద్ద శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఈ కేసులో ప్రధాన నిందితులైన అస్సాం,త్రిపుర రాష్ట్రాలకు చెందిన సురజిత్ చేతియా, అహోట్లియన్ కైపెంగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్న వీరి వద్ద నుంచి రూపాయలు 2 లక్షల నగదు,3 సెల్ ఫోన్లు,వివిధ బ్యాంకులకు చెందిన 57 పాస్ బుక్కులు,35 ఏటీఎం కార్డులు,49 చెక్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ క్లిష్టమైన కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులను,సైబర్ సెల్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.ఈ ముఠా అరెస్ట్ నేపథ్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలనుద్దేశించి ప్రత్యేక సందేశం ఇస్తూ కష్టపడకుండానే సులభంగా డబ్బు వస్తుందంటే అందులో కచ్చితంగా మోసం దాగి ఉందని ప్రజలు గ్రహించాలన్నారు.అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే అంతర్జాతీయ వాట్సాప్ కాల్స్, విదేశీ బహుమతులు,డాలర్ల పేరుతో వచ్చే మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, అత్యాశకు పోతే ఉన్న డబ్బును సైబర్ నేరగాళ్లు దోచేస్తారని హెచ్చరించారు. ఎవరైనా ఏమాత్రం అనుమానం వచ్చినా లేదా సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయినా బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు పంచుకోవడం ఆపేసి తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు గానీ, సమీపంలోని పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Admin
Famous TV