Famous TV - భక్తి / : నాలుగేళ్ల తమ ధర్మకర్తల మండలి హయాంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. ఎస్వీబీసీ 15వ వార్షికోత్సవం శుక్రవారం తిరుపతిలోని ఛానల్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి కూడా భయపడిన సమయంలో ఈవో శ్రీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా చక్కటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేశారని చెప్పారు. ఎస్వీబీసీ ద్వారా ప్రసారం అయిన సుందరకాండ, భగవద్గీత లాంటి పారాయణాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయన్నారు. తద్వారా ఛానల్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు పెరిగారని, ఎస్వీబీసీ యూట్యూబ్, ఆన్లైన్ రేడియో కూడా భక్తుల ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. హిందీ, తమిళం, కన్నడ భాషలకు ఆయా కేంద్రాల్లో స్టూడియోలు నిర్మించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కూడా మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషితో ఛానల్ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. టీటీడీ సంస్థలతోపాటు సంస్కృత విశ్వవిద్యాలయంలోని పండితులు, ప్రవచనకర్తలు, మేధావులను అనుసంధానం చేసి చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. జూలై 3వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీమద్ భాగవతం ప్రవచనానికి విశేషమైన స్పందన వస్తోందని, యూట్యూబ్తోపాటు ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని చెప్పారు. భక్తితోపాటు సమాజంలో మంచిని పెంపొందించడానికి జరుగుతున్న కృషిని భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకుపోవడానికి ఛానల్ ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు. ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ ఉద్యోగులు భక్తిమార్గంలో ఛానల్ను ప్రగతిపథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్కుమార్ వార్షిక నివేదికను చదివి వినిపించారు. రాబోయే రోజుల్లో రూపొందించనున్న కార్యక్రమాలను వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల విజేతలకు టీటీడీ ఛైర్మన్, ఈవో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డులు సభ్యులు శ్రీ నందకుమార్, టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు శ్రీమతి వసంత కవిత, సలహాదారు శ్రీ నాగదుర్గారావు పాల్గొన్నారు.
Admin
Famous TV