Famous TV - భక్తి / తిరుపతి : తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రాతఃకాల సమయంలో సుప్రభాతంతో మేల్కొలిపి దైనందిన పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను అలంకార మండపానికి వేంచేపు చేసి రథంపై కొలువు దీర్చారు. బ్రహ్మరథంపై కొలువు దీరిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు అభయం ఇచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణలతో శ్రీవారి బ్రహ్మరథం ముందుకు కదిలింది. గ్రామ పురవీధుల్లో రథంపై విహరిస్తున్న స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఉప్పు, మిరియాలు రథంపై చల్లి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీ దంపతులు, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు స్వామి వారు ఆశీనులైన బ్రహ్మ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మరథానికి ముందు భజన బృందాలు, కోలాటాలు , పిల్లన గ్రోవి కళాకారులు, వేద పండితుల మంత్రాలు ఎంతో అలరించాయి.
Admin
Famous TV