Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం టీటీడీ పరిపాలన భవనం లో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వరరెడ్డి తో పాటు వివిధ శాఖల అధికారులు, టీటీడీ అధికారులతో ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ 1. డౌన్ ఘాట్ రోడ్డులో 1వ మలుపు, 7వ మైల్, అలిపిరి డౌన్ గేట్, అప్ ఘాట్ రోడ్డులో లింక్ రోడ్డు, సహజ సిద్ధంగా ఏర్పడిన ఆర్చి( గరుడ ఆకారం), దివ్యారామం ప్రాంతాల్లో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేయాలి. 2. అప్ ఘాట్ రోడ్డులో లాగా డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్స్ నిర్మించాలి. 3. ఏ రకమైన వాహనాలను ఘాట్ రోడ్డులో నిషేధించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలి. 4. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలి. 5. ఘాట్ రోడ్లలో స్పీడ్ లిమిట్ ఎంత? డ్రైవింగ్ చేసేప్పుడు మొబైల్ వాడకంపై నిషేధం, తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు తెలిపేలా నిరంతరం కర పత్రాలు పంపిణీ చేయాలి. 6. ఘాట్ రోడ్లలో వాహనాల వేగాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలి 7. అంబులెన్స్ లు , రెస్క్యూ టీమ్ లు అవసరమైన పరికరాలతో సదా సన్నద్ధంగా ఉండాలి. 8. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ బస్సుల్లో ఆడియో టేపు లు వినిపించే ఏర్పాటు చేయాలి. 9. తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంచాలి 10. ఘాట్ రోడ్లలో ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ఓవర్ టేక్ చేయకుండా చర్యలు తీసుకోవాలి. 11. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగిన తక్షణమే రుయాతో పాటు స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి. జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ ఎ సిఏవో శ్రీబాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీనాగేశ్వరరావు, టీటీడీ ఇంజినీరింగ్ సలహాదారు శ్రీ రామచంద్రారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ , బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి , రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు , అదనపు ఎస్పీ శ్రీమునిరామయ్య, ఆర్టీసీ ఆర్ఎం శ్రీ చెంగల్ రెడ్డి, ఇంచార్జ్ ఆర్టీవో శ్రీ రవీంద్ర నాథ్ సమావేశంలో పాల్గొన్నారు.
Admin
Famous TV