Famous TV - భక్తి / తిరుపతి : తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం అనంత తేజోమూర్తి అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు అశ్వాలు, వృషభాలు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ అంగరంగ వైభవంగా ముందుకు సాగింది. సింహ వాహనధారుడైన శ్రీవారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. సింహ వాహన వైశిష్ట్యం: దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై నరసింహ అవతారంలో కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహ దర్శనం’ ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్య వంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి కలుగుతుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా శ్రీనివాసుడు నిరూపిస్తారని చరిత్ర.
Admin
Famous TV