Famous TV - భక్తి / తిరుపతి : తుమ్మలగుంటలో జరుగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం స్వామి వారు మురళీ మనోహరుని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మలయప్ప స్వామి వారు చిన్నశేష వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి చిన్నశేష వాహనంకు ముందు అశ్వాలు, వృషభాలు నడుస్తుండగా భజన బృందాలు తమ నృత్యాలతో భక్తులకు కనువిందు కలిగించారు. చిన్నశేషుని విశిష్టత:శేషుడు నారాయణాంశ సంభూతుడు. విష్ణువు యొక్క అపరదేహం, ఐదు పడగలు కలిగిన ఈ వాహనంలో రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహం తిరుమలలో కొంతకాలం ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అందుకు గౌరవ సూచికంగా రెండవ రోజు ఉదయం స్వామి వారు ఐదు పడగలు గల చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి. చిన్నశేషవాహనంపై శ్రీ వేంకటేశ్వరుడు మురళీ మనోహారుడు రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దశేషవాహనాన్ని అదిశేషుడిగానూ, చిన్నశేష వాహనాన్ని వాసుకి సర్పంగానూ భక్తులు భావిస్తారు. ప్రతి మనిషిలో ఉండే మనోవైకల్యాలు సర్పాకారంలో వ్యాపించి ఉంటాయి. చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడిని దర్శించి, ధ్యానించడం వల్ల మనిషిలోని మనోవైకల్యాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. చిన్నశేష వాహనాన్ని దర్శించిన భక్తులకు యోగ సిద్ధిఫలం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది.
Admin
Famous TV