Famous TV - భక్తి / తిరుపతి : తిరుపతి పరిసరాలు నుంచి భారీగా తరలి వచ్చిన శ్రీవారి భక్తులు. వేద పండితుల మంత్రాలు, భక్తుల గోవింద నామాలు , మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, దేవతా మూర్తుల కళా రూపాలతో తుమ్మలగుంట క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం వైభవోపేతంగా సాగింది. తిరుమలకు వెళ్లి శ్రీవారి గరుడోత్సవంను తిలకించలేని భక్తాదులు అందరూ తుమ్మలగుంటకు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల నుంచే చుట్టు ప్రక్కల ప్రాంతాలు, పక్క మండలాల నుంచి భక్తులు తుమ్మలగుంటకు అధికంగా తరలివచ్చారు. పట్టువస్త్రాలు, స్వర్ణ ఆభరణాలు, విశేష పుష్పాల అలంకరణతో ముస్తాబైన కల్యాణ వెంకన్న గరుడునిపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతకు ముందు ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు కల్యాణ వెంకటేశ్వర స్వామి మోహినీ అవతారంలో పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చారు. చిరు జల్లులతో వరుణుడు: గరుడ వాహనదారుడైన శ్రీ మలయప్ప స్వామి అలంకార మండపం నుంచి బయటకు రాగానే వరుణ దేవుడు చిరు జల్లులతో స్వాగతం పలికారు. వాహనం మొదలయ్యే సరికి వర్షం రావడంతో భక్తులు గోవింద గోవింద అంటూ ఆనందంతో స్వామి వారిని కీర్తించారు.
Admin
Famous TV