Famous TV - భక్తి / తిరుపతి : అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్ను శ్రీవారే రక్షించారని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. 14 రోజుల చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఉన్న చిన్నారిని శుక్రవారం ఛైర్మన్ సమక్షంలో వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడారు. జూన్ 22న రాత్రి చిన్నారిపై చిరుత దాడి జరిగిందని, టీటీడీ అధికారులు వెంటనే స్పందించి శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాలుడికి చికిత్స జరిగిందని వివరించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. అటవీ శాఖ సహకారంతో చిరుతను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని చెప్పారు. నడకమార్గాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బాలుడి తల్లిదండ్రులు శ్రీ బి.పులికొండ, శ్రీమతి బి.శిరీష మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయతోనే తమ బిడ్డ ప్రాణాలతో దక్కాడని సంతోషం వ్యక్తం చేశారు . స్వామి వారికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అలాగే చిరుత దాడి జరిగిన 15 నిమిషాల్లో టీటీడీ ఈవో శ్రీఎవి.ధర్మారెడ్డితోపాటు ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని తమ బిడ్డను చిన్నపిల్లల అసుపత్రికి తరలించారని చెప్పారు. వీరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నామని చెప్పారు . ఆసుపత్రిలో వైద్యులు ఎంతో ఓపికగా మెరుగైన వైద్యం అందించి పూర్తి ఆరోగ్యంతో తమ బిడ్డను తిరిగి అప్పగించారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యం చక్కగా చేస్తున్నారని, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉందని చెప్పారు. ఉచితంగా తమ బిడ్డకు వైద్యం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV