Famous TV - విద్య ఉద్యోగాలు / : కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యశస్వి టాలెంట్ టెస్ట్ను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సహజ సంపద సంస్థ వ్యవస్థాపకులు పోచినేని సురేష్ నాయుడు పిలుపు నిచ్చారు. వరదయ్యపాళెంలోని డైనమిక్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రతిభావంతులైన పేద విద్యార్థులను గుర్తించి, వారి చదువులను ప్రోత్సహించడం కోసం ఈ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ఈ పరీక్షల ద్వారా దేశ వ్యాప్తంగా 30,000 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎం. పిక చేసి రెండేళ్ల పాటు స్కాలర్షిప్పులు అందించనుందన్నారు. 9వ తరగతి వారికి రూ. 75,000, 11వ తరగతి చదివే వారికి రూ. 1,25,000 చొప్పున ఏటా స్కాలర్ షిప్ అందించనుందని తెలిపారు. సెప్టెంబర్ 29న జరిగే ఈ పరీక్ష కోసం ఆగస్టు 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, ఆ తర్వాత మార్పులు, చేర్పులను 16వ తేదీ వరకు అనుమతిస్తారని వెల్లడించారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుందన్నారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా, ఇందులో మ్యాథ్స్ కు సంబంధించి 30, జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి 20, సైన్స్, సోషల్ సైన్స్ కు సంబంధించి 25 చొప్పున మార్కులకు ప్రశ్నలుంటాయన్నారు. తప్పు సమాధానాలు రాసినా నెగటివ్ మార్కులు లేవని, అలాగే ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదన్నారు. వార్షికాదాయం రూ. 2.5 లక్షలకు మించని ఓబీసి, ఇబీసి, డీనోటిఫైడ్, సంచార జాతుల పిల్లలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. దరఖాస్తుతో పాటు మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, ఆధార్ కార్డ్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాలని వెల్లడించారు. https://yet.nta.ac.in లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే తమను 9000487879 నెంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.
Admin
Famous TV