Famous TV - కళలు / Hyderabad : వాస్తు, జ్యోతిష్య విభాగాల్లో విశేష కృషి చేస్తున్న తిరుపతికి చెందిన కాపా మధుసూదన్ కి వాస్తు విజ్ఞాన జ్యోతిష్య బ్రహ్మ అవార్డు లభించింది. హైదరాబాద్ లోని లలిత కళా సమాఖ్యమరియు రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం వారు ఆయనకు అవార్డుతో పాటు సువర్ణ ఘంటా కంకణంతో సన్మానించనున్నారు. సికింద్రాబాద్ లోని హరిహరకళా భవన్ లో ఈ నెల 11 వ తేదీన జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ గౌరవం లభించనుంది. ఆయన ఇప్పటికే హైదరాబాద్ ‘సర్ సి.వి.రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ’ వారి ‘ముహూర్త వైభవ సేవారత్న అవార్డు’ అందుకుని ఉన్నారు. రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠంలో విద్యనభ్యసించిన ఆయన గత పదేళ్లుగా కొర్లగుంటలోని తన స్వంత కార్యాలయంలో వాస్తు, జ్యోతిష్యాలకు సంబంధించి ప్రజలకు సేవలందిస్తున్నారు. అమెరికాలాంటి ఉన్నత దేశాల్లోని వారు సైతం ఆయన సేవలను చరవాణి ద్వారా పొందుతూ ఉండటం విశేషం. ఆయన తిరుపతి - తిరుమల దేవస్థానం వారి శ్వేత శిక్షణా కేంద్రంలో నీతి, నైతిక విలువలు, విశేష దినాల ప్రాముఖ్యత లాంటి అంశాలపై అతిథి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు.
Reporter
Famous TV